జగిత్యాల: కోవిడ్-19 తో పోరాడుతూ జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ కె. దక్షిణామూర్తి మృతి చెందారు. ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న ఆయన అకాల మరణానికి తోటి సిబ్బంది సహచరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. 5 రోజుల క్రితం పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26 న ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోవిడ్-19 తో పోరాడుతూ మృతి చెందిన పోలీసు సిబ్బంది లో అదనపు ఎస్పీ స్థాయి అధికారి చనిపోవడం తెలంగాణలో ఇదే ప్రథమం. 1989 లో సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీసు శాఖలో చేరిన దక్షిణ మూర్తి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇన్స్పెక్టర్ గా, డిఎస్పీగా విధులు నిర్వహించారు. అదనపు ఎస్పీగా నిర్మల్, జగిత్యాలలో పని చేశారు.