
హైదరాబాద్: అతని స్టైలే వేరు… 9 రాష్టాలలో వ్యాపారాలు.. సొంత విమానంలో షికార్లు… పెద్ద పెద్ద పోలీసు అధికారులతో పరిచయాలు. ఇలా తనకున్న పలుకుబడితో ఎలాంటి కేసునైనా ఇట్టే మాఫీ చేయిస్తానని నమ్మిస్తాడు. అందిన కాడికి దండుకుని చేతులెత్తేస్తాడు. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యాపార సోదరులను మోసం చేసి రూ. 3.6 కోట్లు కాజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపులు, మోసాలకు పాల్పడి రూ. 3.6 కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, పుణే ప్రాంతానికి చెందిన కపిల్ రాజేంద్ర కుమార్ బాహెతీ అలియాస్ కపిల్ పేలుడు పదార్థాల తయారీ వ్యాపారం చేస్తుంటాడు. నగరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా పేలుడు పదార్థాల తయారీ వ్యాపారం చేస్తుంటారు. వారితో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వారి కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించి… అధికారులను మేనేజ్ చేయాలనే సాకుతో పలు దఫాలుగా రూ. 3.6 కోట్లు వసూలు చేసుకున్నాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితున్ని అరెస్టు చేశారు.
రూ. 3.6కోట్లు వసూలు..
పేలుడు పదార్థాలు వ్యాపారానికి సంబంధించి లైసెన్సు కలిగి వ్యాపారం చేస్తున్న హైదరాబాద్కు చెందిన సోదరులు ఏ. విజయ్కుమార్, ఏ. రాజ్కుమార్లు ఇక్కడే ఉంటున్నారు. అనుమతి లేకుండా 10 టన్నుల అమ్మోనియాను తరలిస్తున్నాడనే కారణంతో 2019లో రాజ్కుమార్ను ఆర్జీఐ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాత పరిచయమున్న కపిల్ ఈ వ్యవహారంలో తలదూర్చి రాజ్కుమార్ను విడుదల చేయిస్తానని విజయ్కుమార్ను నమ్మించాడు. దానికోసం అధికారులకు ఇవ్వడానికి కోటి రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పాడు. నమ్మిన బాధితుడు కపిల్ ఆదేశాల మేరకు రూ. 60 లక్షలు హవాలా ఏజెంటు ద్వారా చెల్లించాడు. కేసును క్లోజ్ చేయడానికి… సీనియర్ పోలీసు అధికారులను మేనేజ్ చేయాల్సి ఉంటుందని… అదనంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. అతన్ని నమ్మడంతో పాటు భయాందోళనల్లో ఉన్న బాధితుడు విజయ్కుమార్ మరో రూ. 1.50 కోట్లు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆగకుండా వరసగా ఓ సారి రూ. 20లక్షలు, మరోసారి రూ. 15 లక్షలు చెల్లించాడు.వ్యాపారం నిమిత్తం సోదరులకు సంబంధించి బీహార్తో పాటు ఇతర రాషా్ట్రలకు లోడుతో ఉన్న వాహనాలు తరలి వెళ్తుంటాయి. వ్యాపారం గురించి తెలుసుకున్న కపిల్ బీహార్లో ఏటీఎస్ పోలీసులు వారిపై విచారణ జరుపుతున్నారని… ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశముందని బెదిరించాడు. ఏటీఎస్ పోలీసులను మేనేజ్ చేయడానికి అంటూ మరో రూ. కోటి డిమాండ్ చేశాడు. అతని మాటలు నమ్మి మరోసారి రూ. 60లక్షలు హవాలా ద్వారా పంపించాడు. అంతే కాకుండా ఆ తర్వాత 2019 అక్టోబర్ 29న ఎస్ఓటి పోలీసులు భోన్గిరిలో ఉన్న ఆయా సోదరులకు సంబంధించి గొడౌన్లలో దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. అదే రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, రాయ్పూర్లోనూ అనుమతి లేని లారీకి సంబంధించి ఓ కేసు నమోదైంది. ఓ సోదరుడి అరెస్టుతో పాటు వివిధ పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసుల గురించి తెలుసుకున్న కపిల్ అమాయకులైన సోదరులను మోసం చేస్తూనే ఉన్నాడు. సోదరుడి అరెస్టు, రిమాండ్ నుంచి బెయిల్ ఇప్పించడమే కాకుండా కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించాడు. కేసుల తీవ్రత చూపి వారిని బెదిరించాడు. మేనేజ్ చేయకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భయాందోళనలకు గురి చేశాడు. అంతా మేనేజ్ చేస్తానని నమ్మించి… దానికోసం భోన్గిరి, రాయ్పూర్ కేసులకు సంబంధించి రూ. 35లక్షలు, రూ. 25లక్షలు డిమాండ్ చేశాడు. ఓ కేసుకు సంబంధించి రూ. 35లక్షలు చెల్లించిన తర్వాత అప్పుడు కపిల్ వ్యవహారంపై అనుమానంతో రూ. 25లక్షలు ఇవ్వలేదు. అప్పటికే నిందితుడు మొత్తం రూ. 3.6 కోట్లు తీసుకున్నాడు.
డబ్బులివ్వకుంటే బెదిరింపులు..
అయినా సాధారణంగా బెయిల్ లభించనంత వరకు రాజ్కుమార్ జైలు నుంచి బయటకు రాకపోగా… కేసులు కూడా క్లోజ్ కాలేదు. నిందితుడి గురించి తెలుసుకున్న బాధితులు అతనికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించగానే బెదిరింపులు తీవ్రం చేశాడు. కేసులు బుక్ చేయిస్తానని ఇతర సెక్షన్ల కింద వ్యాపారానికి దెబ్బ తీస్తానని బెదిరించాడు. చివరకు బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పుణేకు ప్రత్యేక బృందాన్ని పంపించి… నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితున్ని విచారించగా… అతని పేరిట పుణెలో కపిల్ సన్స్ ట్రేడింగ్, మహారాష్ట్ర, ధూలేలో రాహుల్ ఏజెన్సీ, తమిళనాడు కరూర్లో అరుణ్ మురుగన్ ఎక్స్ప్లోజివ్స్, రాజస్థాన్, పాలిలో లక్ష్మీ ట్రేడర్స్, రాజస్థాన్ ఢోల్పూర్లో రాజస్థాన్ ఎక్స్ప్లోజివ్స్ వ్యాపారాలు ఉన్నట్లు గుర్తించారు.