
హైదరాబాద్: బొగ్గును అక్రమ రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం (జూలై-31) మీడియాతో మాట్లాదారు. నల్లబొగ్గు అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. అక్రమంగా తరలిస్తున్న 1,050 టన్నుల బొగ్గును సీజ్ చేయడంతో పాటు నిందితల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలతో మొత్తం రూ. 2 కోట్లు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సి పి వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు అయినప్పటికీ ఈ బొగ్గు మాఫియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు మహేష్ భగవత్ చెప్పారు. నగర శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద డంపింగ్ యార్డ్ తయారు చేసుకున్న ముఠా అక్కడి నుంచే కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా లారీ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం నడిపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్కు తీసుకొచ్చి వాటిని కల్తీ చేసి వివిధ ప్రాంతాలకు పంపుతారు. కృష్ణ పట్నం, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా అవుతుంది. ఇతర రాష్ట్రాల సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేస్తారు. క్వాలిటీ ఉన్న బొగ్గులో నాణ్యత లేని వాటిని మిక్స్చేసి పలు కంపెనీలకు సరఫరా చేస్తారు అని మహేష్ భగవత్ తెలిపారు.