హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. దర్యాప్తు సాగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో డ్రగ్ దందాలో కింగ్పిన్ గా ఉన్న కెల్విన్.. ఈడీ అధికారులకు అప్రూవర్గా మారారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో కెల్విన్ కీలక నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. మాదకద్రవ్యాలకు సంబంధించి బాలీవుడ్ కేసులో కూడా కెల్విన్కు లింకులు ఉన్నట్లు తేలింది. అలాగే టాలీవుడ్ డ్రగ్ కేసులో కెల్విన్ సూత్రధారి, పాత్రధారిగా ఉన్నారని అధికారులు నిర్ధారించారు. ఇతన్ని ఇప్పటివరకు ఈ డి పదికి పైగా సార్లు విచారించింది. గతంలో ఎక్సైజ్ పోలీసుల విచారణలో కూడా కెల్విన్ ఎలాంటి విషయాలూ చెప్పలేదు. కెల్విన్కు సంబంధించినన బ్యాంకు అకౌంట్లలోకి సినీ తారలు భారీగా డబ్బులు జమ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో సినీ తారల బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. కెల్విన్తో పాటూ మరో ముగ్గురు విదేశీయులు ఈడీ అధికారులకు అప్రూవర్గా మారి కీలక సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పలువురు సినీ తారలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. గురువారం సినీతార చార్మిని విచారించే అవకాశం ఉంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. సినీతారల విచారణ తర్వాత.. పూర్తి సమాచారం తెలియజేస్తామని ఈడీ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఈడీ.. డ్రగ్స్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.