Saturday, April 27, 2024

ఫేక్‌న్యూస్‌తో నింద‌లా?

యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఎక్స్‌లో కేటీఆర్‌

హైద‌రాబాద్ మార్చ్ 24 నేరాలు-ఘోరాలు:
ఫేక్‌ న్యూస్‌ ప్రసారం చేస్తూ వ్యక్తిగతంగా తనతో పాటు తన పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. ట్వీట్‌ వివరాలిలా ఉన్నాయి. ‘బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్‌ నెయిల్స్‌ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్థమైన వీడియోలను, ఫేక్‌ న్యూస్‌ లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నాము. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాము. గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్థంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబ్‌ నెయిల్స్‌ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్‌ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతోపాటు ఆయా యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్‌ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. ఇప్పటికేౖనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్‌ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము.’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Related Articles

Latest Articles