Monday, April 29, 2024

ట్రేడింగ్ టిప్స్ ఇస్తామ‌ని రూ 58.66 లక్షల టోపీ

సంగారెడ్డికి చెందిన ఇద్దరు అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు

స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు సంపాదించడానికి టిప్స్‌ ఇస్తామంటూ పలువురిని మోసం చేయడంలో సహకరించిన సంగారెడ్డికి చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి మాయమాటలను నమ్మి మోసపోయిన బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బల్కంపేటకు చెందిన బాధితుడికి ఇనస్టా, టెలిగ్రామ్‌ ద్వారా కొందరు సైబర్‌ నేరస్థులు సంప్రదించారు. సీక్వోఇయా క్యాపిటల్‌ బిజినెస్‌ స్కూల్‌ పేరిట దందా సాగిస్తూ స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలో టిప్స్‌ ఇస్తామంటూ బురిడీ కొట్టించారు. అతని నుంచి పెట్టుబడుల రూపంలో మొత్తం రూ. 58.66 లక్షలు కాజేశారు. మోసపోయిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంగారెడ్డికి చెందిన గడిల సాయిగౌడ్‌, శీలంకోటి సాయికుమార్‌లను అరెస్టు చేశారు. వారిని విచారించగా పింకు, శరత అనే ఇద్దరితో కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు ఒప్పుకున్నారు. స్టాక్‌మార్కెట్‌ పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌ చేయిస్తే 5శాతం కమీషన వచ్చేదని పోలీసులకు చెప్పారు. అంతే కాకుండా బైనాన్స క్రిప్టో ఎక్స్‌ఛేంజి, యూఎస్‌ డాలర్‌ ట్రేడింగ్‌ పీ2 మీద అదనపు కమీషన ఇచ్చే వారని వెల్లడించారు. నిందితుల ద్వారా 45కేసుల్లో రూ. 13కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 45కేసులు నమోదైనట్లు పోలీసులు వివరాలు సేకరించారు. వాటిలో 3 కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. వారి వద్ద నుంచి మొబైల్‌ఫోన స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles